హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో సైబరాబాద్ కమిషనరేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి రద్దీ ప్రాంతాల్లోని పలు పాపులర్ హోటళ్లు, ఈటరీస్పై సైబరాబాద్ సీవీఎంసీ బృందాలు ఈ మెరుపు దాడులు చేశాయి. ఈ సందర్భంగా వంటశాలల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు, ఆహార భద్రత, పరిశుభ్రత పాటించకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న పలు రెస్టారెంట్ యాజమాన్యాలకు అధికారులు అక్కడికక్కడే ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
ఈ తనిఖీల్లో గచ్చిబౌలిలోని ప్రసిద్ధ షా గౌస్ రెస్టారెంట్లో విస్తుపోయే లోపాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు కిచెన్ అంతా ఈగలు ముసురుతుండటం, డ్రెయినేజీలు తెరిచి ఉంచడం వంటి విషయాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కనీస లేబుళ్లు లేని ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడాన్ని పట్టుకున్నారు. కనీస నియమాలు పాటించని ఈ హోటల్కు అధికారులు కేవలం 65 నుంచి 67 శాతం లోపు మాత్రమే హైజీన్ రేటింగ్ ఇచ్చి, లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు అందజేశారు.
మరోవైపు మాదాపూర్లోని ఐడియల్ కిచెన్, కొండాపూర్లోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్లలోనూ దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఐడియల్ కిచెన్కు చెందిన ఫ్రీజర్లో నిల్వ ఉంచిన పిండివంటలపై బొద్దింకలు తిరుగుతుండటం, వంటకాలకు వాడే మినప్పప్పులో పురుగులు ఉండటాన్ని అధికారులు గమనించి 67 శాతం హైజీన్ స్కోర్ కేటాయించారు. అలాగే పాలమూరు గ్రిల్లో ఏకంగా లేబుల్ ట్యాంపరింగ్కు పాల్పడుతూ, గడువు ముగిసిన మష్రూమ్స్ నిల్వ ఉంచినట్లు తేలడంతో అధికారులు వాటిని వెంటనే పారవేయించారు. తుప్పుపట్టిన ఫ్రీజర్లు, ఈగలతో అపరిశుభ్రంగా ఉన్న ఈ హోటల్కు అత్యంత తక్కువగా 60 శాతం రేటింగ్ ఇచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి సంస్థలనైనా వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
Telangana
ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
Quick Summary:
ప్రముఖ హోటళ్లకు నోటీసులు
